ఫ్రీగా వస్తోందని ఫినాయిలే కాదు..అతిగా నీళ్లు తాగినా ప్రమాదమే

గురువారం, 3 ఆగస్టు 2017 (01:49 IST)
ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే రకం అంటూ కొంతమంది అలవాట్లను ఈసడిస్తూంటారు. ఫినాయీలేమో కానీ ఫ్రీగా వస్తున్నాయని మంచనీళ్లను కూడా మోతాదు మించి తాగితే ప్రాణాలకు ముప్పే అంటున్నారు వైద్యనిపుణులు. దప్పికవుతోందని బాటిళ్లు బాటిళ్లు నీళ్లు తాగిపడేయడానికి బదులు ప్రతి గంట లేదా రెండు గంటలకు గుర్తు తెచ్చుకని మరీ గ్లాసు నీళ్లు తాగితే శరీరం పూర్తి సమతుల్యతతో ఉంటుందని ఒకేసారి నీరు తాగడం ప్రమాదకరమని వీరంటున్నారు. 
 
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అధికంగా నీటిని తాగాలని భావించడం చాలా తప్పట. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కనీస నీటిని తాగాలని ప్రాచీన ఆయుర్వేదిక్ గ్రంథాలు, వేదాలు చెపుతున్నాయని ఢిల్లీకి చెందిన సర్ గంగారాం ఆసుపత్రి డాక్టర్ పరమేశ్వర్ అరోరా  వెల్లడించారు. అధికంగా నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని తమ అధ్యయనంలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పరమేశ్వర్ అరోరా ఈ విషయాన్ని చెప్పారు. 
 
మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు అధికంగా నీరు తాగడం వల్ల మూత్రపిండాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పేగుల ప్రక్షాళనకు ఉదయాన్నే ఖాళీకడుపుతో 250 మిల్లీలీటర్లు లేదా ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలని డాక్టరు సూచించారు. భోజనం చేసేటపుడు 100 లేదా 150 మిల్లీలీటర్ల నీటిని తాగితే మేలని చెప్పారు. 
 
భోజనం అనంతరం ప్రతీ గంటకు లేదా రెండు గంటలకు ఓ గ్లాసునీటిని తాగితే మంచిదన్నారు. దప్పిక వేసినపుడు 200మిల్లీలీటర్ల గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ పరమేశ్వర్ అరోరా వివరించారు. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్ అనేది ఆహారానికే కాదు మంచినీటికి కూడా వర్తిస్తుందని గమనించాలి.
 

వెబ్దునియా పై చదవండి