రోడ్ సైడ్ పానీ పూరీ, సమోసా, ఫ్రూట్ జ్యూస్‌ల్ని లాగించేస్తున్నారా? ఇ-కొలీతో జర జాగ్రత్త.. గురూ..!

గురువారం, 3 నవంబరు 2016 (14:43 IST)
వర్షాకాలం, శీతాకాలాల్లో రోడ్ సైడ్ భోజనాలకు దూరంగా ఉండటం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోడ్ సైడ్ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా.. ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రోడ్ల పక్కన తోపుడు బండ్లలో నోరూరించే పానీ పూరీలు అమ్మేస్తుంటారు. అలాగే ఫ్రూట్ జ్యూస్లు కూడా అమ్ముతుంటారు. అయితే రోడ్ సైడ్ పానీ పూరీలు, ఫ్రూట్ జ్యూసులు తాగారో మీ పనైపోయినట్లేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.  
 
ఛాట్ ఐటమ్స్ అయిన పానీ పూరీలు, ఫ్రూట్ జ్యూసుల్లో హానికరకమైన బ్యాక్టీరియా, ఫంగస్, ఈ-కొలీ ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన మెడిసిన్ డిపార్ట్ మెంట్ ఇటీవల జరిపిన స్టడీలో... స్ట్రీట్ ఫుడ్ కనిపించడానికి బాగానే ఉన్నా.. వీటికి వాడుతున్న 45 శాతం నీటిలో, 75 శాతం చట్నీలో కాలుష్యకారకమైన ఈ-కొలీ ఉంటుందని, ఇది ఆరోగ్యానికి కీడు చేస్తుందని అధ్యయనంలో వెల్లడి అయ్యింది. వీటితో పాటు పండ్ల రసాల శాంపిల్స్‌ను పరిశోధించడంలో వాటిలో కూడా ఫంగస్ జాడలు కనిపించాయని వారు చెప్తున్నారు.  
 
తోపుడు బండ్లకు పక్కనే చెత్త కుండీలు ఉండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ స్నాక్ ఐటమ్స్‌లో చేరుపోతాయని, ప్లాస్టిక్ ప్లేట్లను కూడా అక్కడే పారేయడం ద్వారా.. అవి కాస్త డిస్పోజబుల్స్ కావడం ద్వారా శుభ్రం చేయక అలానే ఉండిపోతాయి. తద్వారా వాటిలోని బ్యాక్టీరియా కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలకు చేరుతాయి. అందుకే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో బెటరని అధ్యయనకారులు సూచిస్తున్నారు.  
 
ఇంట్లో తయారయ్యే ఆహార పదార్థాలను వర్షాకాలం, చలికాలాల్లో వేడి వేడిగా తీసుకోవడం మంచిదని.. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ సమోసాల్లో ఇలాంటి బ్యాక్టీరియాలో కనిపించలేదని, ఎందుకంటే.. సమోసాలను వేడి చేసిన ఆయిల్‌లో వేయించి తీయడం ద్వారా బ్యాక్టీరియాలు నశింపబడుతున్నాయని చెప్తున్నారు. అందుకే సమోసాలను కూడా వేడిగా ఉన్నప్పుడే తినాలని.. రోడ్ సైడ్‌ ఆరిన సమోసాల జోలికి అస్సలు వెళ్లకూడదని పరిశోధకులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి