'కూరలో కరివేపాకులా తీసిపారేశారు' అంటూ వాపోతారు. 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అలాంటి కరివేపాకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. తెల్లబడిపోతున్న జట్టును ఆపొచ్చు.
ప్రస్తుతం చాలా మంది యువతీయువకులకు తెల్లజుట్టు వచ్చేస్తుంది. వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వస్తుంది. దీంతో వారు చిన్నవయసులోనే వృద్ధులుగా కనిపిస్తుంటారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అనేక రకాల ట్రీట్మెంట్లు చేసుకుంటుంటారు. ఈ సమస్యకు కరివేపాకుతో చెక్ పెట్టొచ్చు.
నెరసిపోతున్న సమస్యకు కరివేపాకుతో చెక్ పెట్టొచ్చు. ఒక కప్పు కొబ్బరి నూనెలో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో రెండు మూడు సార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. పైగా, చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.
అంతేకాకుండా, శిరోజ మూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉంది. కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు కూడా. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి.