చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద్రకు భంగం కూడా కలుగుతుంది. అలాగే, మరికొంతమందికి రాత్రిపూట సరిగా నిద్రపట్టదు. పనిఒత్తిడితో పాటు కుటుంబ సమస్యలు, చిరాకు, అలసట వంటి ఇతరత్రా కారణాల వల్ల అనేక మంది నిద్రకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారు కాస్త ఉప్పు తగ్గించిన ఆహారం తీసుకున్నట్టయితే నిద్రతో పాటు పదేపదే మూత్ర విసర్జనకు కూడా చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లటం తగ్గుతున్నట్టు ఐరోపా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఒక్క రాత్రిపూటే కాదు, పగటి పూట కూడా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. శరీరంలో రక్తం పరిమాణం నియంత్రణలో ఉండటంలో ఉప్పు (సోడియం) కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా ఉప్పు ఎక్కువగా తీసుకున్నట్టయితే రక్తంలో సోడియం మోతాదు పెరుగుతుందట.
దీనివల్ల కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగిపోతుంది. రక్తం పరిమాణం ఎక్కువైతే మూత్రం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, రక్తం పరిమాణంతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలు మరింత ఎక్కువగా నీటిని ఒంట్లోంచి బయటకు పంపటానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని కాస్త తగ్గిస్తే.. రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండానే కాదు, కంటినిండా నిద్రపోయేలానూ చూసుకోవచ్చని పరిశోధకులు సెలవిస్తున్నారు.