కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

బుధవారం, 30 అక్టోబరు 2019 (20:57 IST)
కార్తీకమాసం చాలా పవిత్రమైనది. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీకమాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తే అన్ని శుభాలు చేకూరి మహాశివుని అనుగ్రహం లభిస్తుంది.
 
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. ఈ రోజు ప్రధానంగా తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మెుత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. 
 
ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించినా, ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగించినా మంచి ఫలితం ఉంటుంది. కార్తీకపౌర్ణమినాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు