కావలసిన పదార్థాలు : కాకరకాయలు.. ఆరు కొబ్బరి తురుము.. రెండు కప్పులు ఎండుమిర్చి.. పది ధనియాలు.. రెండు టీ. చింతపండు.. తగినంత శెనగపప్పు.. ఆరు టీ. కందిపప్పు.. పది టీ. ఆవాలు.. ఒక టీ. పసుపు.. అర టీ. ఇంగువ.. చిటికెడు ఉప్పు, నూనె.. సరిపడా
తయారీ విధానం : కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, ఒక టీస్పూన్ శెనగపప్పు, ధనియాలు వేసి వేయించాలి. తరువాత వీటికి కొబ్బరి చేర్చి మెత్తగా రుబ్బి ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో కందిపప్పు, మిగిలిన శెనగపప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి ఉడికించాలి. మరోవైపు చింతపండు నానబెట్టి రసం తీసి ఉంచాలి. కాకరకాయలకు పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు, పావుకప్పు చింతపండు రసం వేసి ఉడికించాలి.
విడిగా మరో గిన్నె తీసుకుని అందులో మిగిలిన చింతపండు రసం పోసి మరిగించాలి. అందులో రుబ్బిన మసాలా ముద్దను వేసి బాగా ఉడికించాలి. చివర్లో ఉడికించిన కాకర ముక్కలు, కందిపప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఇవన్నీ ఉడుకుతూ కూర దగ్గరగా వచ్చిన తరువాత దించేయాలి. చివర్లో ఆవాలు, ఇంగువ, కరివేపాకులతో పోపుచేసి కూరలో కలపాలి. అంతే కాకర పిట్లై తయారైనట్లే. ఇది మధుమేహ వ్యాధితో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది.