వివిధ శుభకార్యాలయాల్లో వివిధ రకాల భోజనాలను వడ్డిస్తుంటారు. ఇందులో ఒకటి పుదీనా పలావు. ఈ పుదీనా పలావు తయారీ విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు... పుదీనా - 3 కట్టలు బాస్మతి బియ్యం - 2 కప్పులు తాజా కొబ్బరి తురుము - పావుకప్పు పచ్చిమిర్చి - 4 ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి) అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్ లవంగాలు - 5 యాలకులు - 5 దాల్చిన చెక్క - 5 పలావు ఆకులు - 5 అనాసపువ్వు - ఒకటి లేదా రెండు వేయించిన జీడిపప్పు - పావుకప్పు నెయ్యి - 3 టీస్పూన్లు ఉప్పు - సరిపడినంత
తయారు చేసే విధానం... పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీ స్పూను ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి.
ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి. తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలపాలి. కుక్కరయితే వెయిట్ పెట్టకుండానూ, గిన్నె అయితే మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి. అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.