కరోనా సమయంలో ఆత్మ నిర్భర నినాదం కష్టమే.. ముందుకు సాగుదాం.. ప్రధాని

శనివారం, 15 ఆగస్టు 2020 (08:10 IST)
Narendra Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై ఏడోసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే రెండేళ్లూ సంకల్పంతో సాగుదామన్న ప్రధాని మోదీ... ఎంతో మంది త్యాగాల ద్వారా మనం ఇప్పుడు స్వాతంత్ర్యంతో ఉన్నామన్న మోదీ... సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ... ముందుకు సాగుదామన్నారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ నినాదం అందుకొని ముందుకు సాగడం అనివార్యం అన్న ప్రధాని మోదీ... తద్వారా భారత్‌లో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 
 
భారత్ అభివృద్ధి చెందితే.. విశ్వ కళ్యాణానికి అది మేలు చేస్తుందన్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి... విదేశాల నుంచి ఉత్పత్తులు, వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని మోదీ... ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగం ఇలా చాలా రంగాల్లో భారత్ దూసుకెళ్లడం అనివార్యమన్న ప్రధాని మోదీ... భారత్‌లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు.
 
ఇకపోతే.. ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని మోదీ... ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ... విజయం సాధించాలన్నారు. కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలని పిలుపు నిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు