అమెరికా తమపై దాడికి దిగితే, వారిపై కూడా దాడి చేసేందుకు తాము సంశయించబోమని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఇటీవల అణు పరీక్ష నిర్వహించి సంచలనం సృష్టించిన ఉత్తర కొరియా తాజాగా క్షిపణి విడిభాగాలను ఎగుమతి చేస్తుండటంతో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఉత్తర కొరియా క్షిపణి ఎగుమతులను అడ్డుకునేందుకు అమెరికా మిత్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉత్తర కొరియాతో తలెత్తిన ఉద్రిక్తతలపై మాట్లాడుతూ.. ఆ దేశం విషయంలో ఏర్పడే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తర కొరియా దూకుడు, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉంటాలని కోరారు. క్షిపణులు, క్షిపణి విడిభాగాలను మయన్మార్ వైపుకు తీసుకెళుతున్న ఉత్తర కొరియా నౌకను రహస్యంగా అమెరికా నావికా దళ విధ్వంసక నౌక అనుసరిస్తుందని దక్షిణ కొరియాకు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఇటీవల అణు పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియాపై భద్రతా మండలి ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆంక్షల్లో భాగంగా ఉత్తర కొరియా అణు, ఖండాంతర క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు అంతర్జాతీయ నాయకత్వానికి నౌకలు సోదా చేసే అధికారాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కల్పించింది.