కరాచీలో ప్రజ్వరిల్లిన హింస: 30 మంది మృతి

పాకిస్థాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో హింస నానాటికీ ప్రజ్వరిల్లుతోంది. తాజాగా రాజుకున్న హింసాకాండలో 30 మంది వరకు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దీర్ఘకాలం కొనసాగిన రాజకీయ వివాదాలు, జాతి విద్వేషాలు ఇప్పుడు ముఠా ఘర్షణలుగా మారి హింసాగ్నిని రాజేస్తున్నాయని గురువారం పోలీసులు అంగీకరించారు. లయారీ పాత జిల్లా చుట్టుపక్కల ప్రాంతంలో తాజాగా ముఠా ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నట్టు తెలిపారు.

ఇలా ఘర్షణలు జరిగే ప్రాంతం అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ ప్రాతినిథ్యం వహించే పీపీపీకి బాగా పట్టున్న ప్రాంతం కావడం విశేషం. ఇదే ప్రాంతం నుంచి క్రిమినల్‌ ముఠాలు తమ అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మాదకద్రవ్యాలు, మానవ రవాణాలు గ్యాంగ్‌వార్‌కు మూలంగా అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి