ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో తాలిబాన్ తీవ్రవాదుల వరుసగా దాడులకు తెగబడుతున్నారు. కాబూల్లో మంగళవారం తాలిబాన్లు చేసిన బాంబు దాడుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే బుధవారం ముగ్గురు సాయుధులు సెంట్రల్ కాబూల్లోని ఓ బ్యాంకులోకి చొరబడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 20న ఆఫ్ఘనిస్థాన్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తాలిబాన్లు ఇటీవల కాలంలో వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని ఇప్పటికే వారు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు.
ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన వరుస దాడుల్లో భాగంగానే కాబూల్ బ్యాంకులోకి తాజాగా తమ సాయుధులు చొరబడ్డారని తాలిబాన్ ప్రతినిధులు తెలిపారు. సాయుధులు ఆధీనంలోకి తీసుకున్న బ్యాంకును పోలీసులు చుట్టుముట్టారు. బ్యాంకులో చొరబడినవారు దొంగలు అయి ఉంటారని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది తాలిబాన్ల తీవ్రవాద చర్య కాదని కొట్టిపారేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సివుంది.