ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో శనివారం ఉదయం భారీ పేలుళ్ళు సంభవించాయి. రాజధానిలోని విదేశీ రాయబార కార్యాలయాలు, నాటో ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్ళు జరిగాయి.
రానున్న ఐదు రోజుల్లో ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పేలుళ్ళు జరగడం వెనుక ఉగ్రవాదులు ముందస్తు వ్యూహంగా విదేశీ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్ళు జరిగిన ప్రదేశంలో పొగ దట్టంగా కమ్ముకుంది.
పేలుళ్ళు జరిగిన అనంతరం రోడ్డంతా రక్తపు మడుగులా మారింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా 14మంది తీవ్ర గాయాలపాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గాయాలపాలైనవారిలో చాలామంది పిల్లలున్నారు. వీరు నాటో ప్రధాన కార్యాలయం ముందు జిగురు అమ్ముతున్నారు.
దాడులు జరిగిన ప్రాంతంలో వాహనాలు చాలావరకు పాడైపోయాయని గాయాలపాలైనవారు మరింతమంది ఎక్కువకావచ్చని ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహమ్మద్ జహీర్ అజీమీ తెలిపారు.
శనివారం జరిగిన ఈ దుర్ఘటనతో ఆ దేశ రాజధాని అట్టుడికిపోయింది. కాబూల్లోని అంతర్జాతీయ రాయబార కార్యాలయాలకు సమీపంలో ఈ సంఘటన జరిగిందని, నాటో కార్యాలయానికి నలువైపులా సిమెంట్ బ్లాకులు కట్టడం వలన దుండుగులు లోనికి ప్రవేశించలేకపోయారని, నాటో కార్యాలయం పాక్షికంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.