భారతీయుల్లో అమెరికా వీసాలకు తగ్గిన క్రేజ్

అమెరికాను ఆర్థిక మాంద్యం కుదేలుచేస్తుండటంతో ఆ దేశానికి వెళ్లవారి సంఖ్య నానాటికీ తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా గతంలో అమెరికా అంటే భారతీయుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఉన్నవారి పరిస్థితే డోలాయమానంలో ఉండటంతో.. కొత్తవారు అక్కడి వెళ్లేందుకు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు.

ఫలితంగా ఈ ఏడాది అమెరికా వీసాలు తీసుకున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. హెచ్1 అమెరికా వీసా జారీలు బాగా తగ్గాయని అమెరికా కాన్సులేట్ చీఫ్ సోమవారం అహ్మదాబాద్‌లో వెల్లడించారు. జారీ అయిన మూడింట రెండొంతుల వీసాలు గత మూడు- నాలుగు నెలల్లోనే ఉపయోగించుకున్నారని తెలిపారు.

గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది వీసాలు వినియోగంలేదని, మాంద్యం కారణంగా వీటి వినియోగం తగ్గిందని చెప్పారు. గత ఏడాది మొదటి 3, 4 నెలల్లోనే వీసాలన్నీ జారీ అయ్యాయి. ఈ ఏడాది ఇదే కాలంలో మూడింట రెండొంతులు మాత్రమే జారీ చేశామని తాత్కాలిక కాన్సుల్ జనరల్ డేవిడ్ టైలర్ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు.

అమెరికా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 65000 హెచ్-1 వీసా (వర్కింగ్ వీసా)లు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు వీటిలో 40000- 45000 వీసాలు మాత్రమే జారీ అయ్యాయని టైలర్ తెలిపారు. సగటున అన్ని విభాగాల్లో తాము 1000 వీసా దరఖాస్తులు పొందుతున్నామన్నారు. హెచ్1 వీసాల వినియోగం భారత్‌లోనే ఎక్కువ. వాస్తవానికి అమెరికా జారీ చేసే సగం హెచ్1 వీసాలు భారతీయులే ఉపయోగిస్తారు.

వెబ్దునియా పై చదవండి