పాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్లో తాలిబాన్ తీవ్రవాదులకు నేతృత్వం వహిస్తున్న మోస్ట్వాంటెడ్ తీవ్రవాది బైతుల్లా మెహసూద్ను పట్టుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు.
తెహ్రీక్- ఎ- తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ను పట్టుకొని తీరతామని బ్రిటన్కు పాక్ ప్రభుత్వం తెలియజేసింది. గత కొన్ని నెలలుగా పాక్లోని సమస్యాత్మక స్వాత్ లోయలో ఆ దేశ సైన్యం తాలిబాన్ తీవ్రవాదులపై పోరాటం జరుపుతుంది. ఈ పోరులో వందలాది మంది తాలిబాన్ తీవ్రవాదులను సైనికులు హతమార్చారు.
తాలిబాన్ల చీఫ్ మెహసూద్ను పట్టుకునేందుకు కూడా పాక్ ఆర్మీ ప్రయత్నాలు చేపట్టింది. మెహసూద్ను పట్టుకునే వరకు సైనిక పోరును కొనసాగిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.
తాజాగా సైనిక చర్యపై రెహమాన్ మాలిక్ మాట్లాడుతూ.. మెహసూద్పై రూ.50 మిలియన్ల నజరానా ప్రకటించబడి ఉందని తెలిపారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన తీవ్రవాదంపై పోరు, ఇతర భద్రతాపరమైన అంశాల్లో బ్రిటన్, పాక్లు సహకరించుకుంటున్నాయని చెప్పారు.