రఫ్సంజానీ కుమార్తె అరెస్ట్: మతపెద్దల్లో చీలిక

ఇరాన్ మాజీ అధ్యక్షుడు హషేమీ రఫ్సంజానీ కుమార్తెను, మరో నలుగురు ఆయన బంధువులను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్‌లో అత్యంత శక్తిమంతుల్లో రఫ్సంజానీ కూడా ఒకరు. తాజాగా ఆయన కుమార్తెను ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేయడం అధికార ఇస్లామిక్ మతపెద్దల మధ్య విభేదాలకు దారితీసినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌లో ఇటీవల జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై పెద్దఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో మరో పది మంది మరణించారని ఆదివారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీంతో అధ్యక్ష ఎన్నికలపై జరుగుతున్న ఆందోళన కారణంగా మృతి చెందినవారి సంఖ్య 17కు చేరిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఘర్షణల్లో పది మంది మృతి చెందగా, వంద మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. జూన్ 12న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇరాన్‌లో అహ్మదీనెజాద్ విజయంపై భారీస్థాయిలో ఆందోళన జరుగుతుంది.

అధ్యక్ష ఎన్నికల అనంతరం దేశంలో సంఘర్షణ వాతావరణం నెలకొంది. శనివారంనాటి ఘర్షణల్లో ఆందోళనకారులను రెచ్చగొట్టారని ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు హష్మీ రఫ్సంజానీ చిన్న కుమార్తె ఫయాజ్ హష్మీ, నలుగురు బంధువులను ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. రఫ్సంజానీ దేశంలో రెండు శక్తివంతమైన సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి