సైన్యం కస్టడీకి ఇమ్రాన్ ఖాన్‌ దంపతులు?

వరుణ్

గురువారం, 25 జులై 2024 (17:36 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ దంపతులను సైన్యం కస్టడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. దీంతో మిలిటరీ కస్టడీని ఆపాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. పాకిస్థాన్ క్రికెట్ లెజండ్‌గా గుర్తింపు పొందిన ఇమ్రాన్.. పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన దేశ ప్రధానిగా కూడా పనిచేశారు. అయితే, గత యేడాది మే నెల 9వ తేదీన జరిగిన ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో అల్లర్లకు కుట్రపన్నారంటూ ఆయనతో పాటు ఆయన భార్య బుష్రా బీబీపై నిందలు మోపి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు వీరిద్దరినీ సైనిక కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నాలను ఆపాలని వారు కోర్టును ఆశ్రయించనున్నారు. 
 
ఓ కేసు విచారణ నిమిత్తం గురువారం జైలు నుంచి కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. 'మమ్మల్ని మిలిటరీ జైలుకు పంపించేందుకు వారు కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మా పార్టీకి చెందిన కార్యకర్తలను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. నాపైనా అలాంటి చర్యలకే పాల్పడాలని చూస్తున్నారు' అని ఆరోపించారు.
 
తనను సైన్యం కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మే 9 నాటి అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్‌లు మిస్‌ అయ్యాయని, వాటిని దొంగలించిన వారే అసలు నేరస్థులని అన్నారు. ఇలాంటి కేసుల్లోని నిందితులను పౌర న్యాయస్థానాల పరిధిలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
 
గతేడాది అల్‌ ఖాదిర్‌ ట్రస్టు కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేయగానే.. ఆయన పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగారు. మే 9న వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగారు. భవనాలను ధ్వంసం చేశారు. రావల్పిండిలోని ఆర్మీ బేస్‌ క్యాంప్‌, జనరల్‌ హెడ్‌క్వార్టర్స్‌పైనా దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇమ్రాన్‌ సహా 100 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు