సామర్లకోట కుర్రాడు.. దిలీప్‌కు ఆపిల్‌లో ఉద్యోగం.. ఏడాదికి రూ.2కోట్ల జీతం..

గురువారం, 18 మే 2017 (10:21 IST)
అమెరికాలో భారీ వేతనానికి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏపీకి చెందిన కుర్రాడు కొలువు దీరాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురానికి చెందిన తపాలా శాఖాధికారి ఇంటి సుబ్బారావు, సూర్యకుమారి దంపతుల రెండో కుమారుడు ఇంటి దుర్గాలక్ష్మీనారాయణస్వామి(దిలీప్‌) ఆపిల్‌ సంస్థలో వార్షిక వేతనం రూ.2 కోట్లకు కొలువు సాధించారు. ఈ నెల 22 నుంచి ఉద్యోగంలో చేరనున్నారు.
 
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు సాధించిన దిలీప్.. బిట్స్‌ పిలానీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేశారు. క్యాట్‌లో 99.3 స్కోర్‌ సాధించి అమెరికాలోని వర్జినియా టెక్‌లో ఎంఎస్‌ చదివేందుకు (2015-17) ఎంపికయ్యారు. ఈ మధ్యే ఎంఎస్‌ను పూర్తి చేశారు. ఈలోపే కాలిఫోర్నియాలోని ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌లో ఉద్యోగం తలుపు తట్టింది. ఇంటర్వ్యూలో సైతం ఉత్తీర్ణత సాధించడంతో.. ఏడాదికి దాదాపు రూ.2కోట్ల వేతనం చెల్లించేందుకు ఆపిల్ సంస్థ ఒప్పందం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి