భారత సైనికులపై సూక్ష్మ తరంగాలతో చైనా దాడి...?

బుధవారం, 18 నవంబరు 2020 (08:31 IST)
భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతల నివారణకు ఇరు దేశాల మధ్య వివిధ దశల్లో శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ.. పరిష్కారం లభించడం లేదు. మరోవైపు, చైనా కూడా ఒకవైపు శాంతిమంత్రం జపిస్తోంది. మరోవైపు భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది.

ఇందులోభాగంగా, భారత సైనికులపై ఓ రహస్య అస్త్రాన్ని ప్రయోగించింది. అంటే సూక్ష్మ తరంగాలతో దాడి చేసిందట. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ ప్రొఫెసర్ వెల్లడించారు. అసలు సూక్ష్మ తరంగాలతో ఎలా దాడి చేసింది..? దీనివల్ల భారత సైనికులకు కలిగే నష్టమేంటి? అనే అంశాలను పరిశీలిస్తే... 
 
ఇటీవల కాలంలో భారత్ తిరుగులేని విధంగా ఆయుధ పాటవం పెంచుకుంటోంది. విదేశీ అస్త్రాలే కాకుండా, దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలతో చైనాకు గట్టి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో చైనా భారత సైనికులను దొంగదెబ్బ తీసే చర్యలకు తెరలేపింది. ముఖ్యంగా, హిమాలయ పర్వత సానువుల్లో సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై రహస్య అస్త్రం ప్రయోగించిందని అంతర్జాతీయ అధ్యయనాల నిపుణుడు జిన్ కాన్రాంగ్ అనే ప్రొఫెసర్ బీజింగ్‌లో తన విద్యార్థులకు తెలిపారు. 
 
ఈ మైక్రోవేవ్ ఆయుధం ప్రయోగిస్తే కంటికి కనిపించని సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాలు మానవ శరీరంపై నిశ్శబ్దంగా దాడిచేస్తాయని వెల్లడించారు. మైక్రోవేవ్ ఓవెన్‌లో నీటి అణువులు ఎలా వేడి అవుతాయో, ఈ విద్యుదయస్కాంత ఆయుధాలు ప్రయోగించినప్పుడు మనిషి చర్మం కింద ఉన్న నీటిని ఈ సూక్ష్మతరంగాలు టార్గెట్ చేస్తాయని, దాంతో మనిషి విపరీతమైన నొప్పితో బాధపడడమే కాకుండా, వాంతులు కూడా చేసుకుంటాడని వివరించారు.
 
సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించకుండా భారత సైనికులను దెబ్బతీసే ఈ ఎత్తుగడను చైనా ఎంతో తెలివిగా అమలు చేసిందని ప్రొఫెసర్ కాన్రాంగ్ తెలిపారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ ఆయుధాలను చైనా మోహరించిన 15 నిమిషాలకే సమీపంలోని భారత సైనికులు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారని, వారు కనీసం నిలబడలేకపోయారని దాంతో అక్కడ్నించి వెంటనే వెళ్లిపోయారని పేర్కొన్నారు.
 
దాంతో చైనా బలగాలు తాము కోల్పోయిన భాగాలను మళ్లీ చేజిక్కించుకున్నాయని అన్నారు. భారత సైనికుల్లో పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో కాకలుతీరిన టిబెటన్ యోధులు ఉండడంతో చైనా సైన్యం ఈ సూక్ష్మతరంగాలను ఆయుధాలుగా చేసుకుందని ప్రొఫెసర్ కాన్రాంగ్ తన విద్యార్థులకు తెలిపారు. మొత్తంమీద జిత్తుల మారి డ్రాగన్ కంట్రీ... తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఎంతకైనా తెగించేలా వుంది.ే

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు