చైనా ప్రజలకు భయం భయం.. కారణం ఏమిటో తెలుసా?

మంగళవారం, 11 మే 2021 (16:39 IST)
చైనా ప్రజలకు ప్రస్తుతం కొత్త కష్టమొచ్చింది. చైనాలోని హాంగ్‌జూ నగర ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కరోనా భయం వల్ల కాదు. చిరుత దాడి చేస్తుందేమోనని వణుకుతున్నారు. హాంగ్‌జూ సఫారీ పార్కు నుంచి మూడు చిరుతలు ఏప్రిల్ 19న తప్పించుకున్నాయి. అయితే ఈ సంగతి బయటపెడితే సఫారీకి వచ్చేవారి సంఖ్య తగ్గుతుందేమోనని భయయప్పడ సఫారీ యాజమాన్యం అంతా గప్‌చిప్‌గా ఉంచింది. 
 
కానీ బయటకు పొక్కింది. చుట్టుపక్కల అడవుల్లో, తేయాకు తోటల్లో చిరుతలు కనిపించడంతో సంగతి అందరికీ తెలిసిపోయింది. చైనా నెటిజనులు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో వేస్తారా అని దుయ్యబట్టారు. అడవిలో ఓ చిరుతను వీధికుక్కలు వేటాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. మరోదాంట్లో తిరిగిపట్టుకున్న చిరుత వెనుక కాళ్లలో ఒకటి సగమే ఉంది. 
 
ఈ ఘటనలపై ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకున్న చిరుతల్లో ఒకదానిని ఏప్రిల్ 21నే పట్టుకున్నారు. గత శుక్రవారం రెండోది దొరికింది. మూడోది మాత్రం దాగుడుమూతలు ఆడుతున్నది. వేలాది మంది సిబ్బంది పోలీసు కుక్కలతో, డ్రోన్లతో, నైట్ విజన్ గ్లాసెస్‌తో రాత్రింబగళ్లు వెదుకుతున్నా అది దొరకలేదు. చివరకు చికెన్ ఎరగా వేసి పట్టుకోవాలని చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు