చైనాలో కరోనా వైరస్ కలకలం - 106 మంది మృతి... 4 వేల మందికి వైరస్

మంగళవారం, 28 జనవరి 2020 (14:56 IST)
చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్‌కూ పాకాయి. 
 
సోమవారం బీజింగ్‌లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4,000 దాటిపోయిందన్నారు. 
 
మరోవైపు ప్రపంచదేశాలకూ ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా జర్మనీ, శ్రీలంకలో తొలి కేసు నమోదైంది. ఆయా దేశాల్లో చైనా నుంచి వచ్చిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఇటు భారత్‌లోనూ విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారికి థర్మల్‌ పరీక్షలు జరుపుతున్నారు. అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు