కరోనా లోగుట్టును బహిర్గతం చేయాల్సిందే : డబ్ల్యూహెచ్ఓ పాత్రపై మదింపు

సోమవారం, 18 మే 2020 (08:40 IST)
కరోనా వైరస్ గుట్టును బహిర్గతం చేయాల్సిందేనంటూ ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, పలు దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఓ తీర్మాన్ని ప్రవేశపెట్టనున్నాయి. సోమవారం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వార్షిక సదస్సు ప్రారంభంకానుంది. ఇందులో మానవాళిని సంక్షోభంలోకి నెట్టేసిన కొవిడ్‌-19 వైరస్‌ ఎక్కడ పుట్టింది? జంతువుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించింది? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరగాలన్న డిమాండ్‌తో పలు ప్రపంచ దేశాలు కలిసి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. 
 
ఈ ముసాయిదా తీర్మానాన్ని యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాలు, భారత్‌, బంగ్లాదేశ్‌, టర్కీ, జపాన్‌, దక్షిణ కొరియా, రష్యా, కెనడా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా సహా 35 దేశాలు బలపర్చనున్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్‌కు రాసిన ఏడు పేజీల లేఖలో చైనా పేరుకానీ, వూహాన్‌ నగరం పేరుకానీ ఎక్కడా ప్రస్తావించలేదు. 
 
ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ కేంద్రంగా పనిచేసే వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్ సహాయంతో కరోనా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిన ఆనుపానులపై, ఆ రెండింటి నడుమ వాహకాలుగా పనిచేసిన జీవరాశుల పాత్రపై అధ్యయనం చేయాలని డబ్ల్యూహెచ్‌వోకు సూచించాయి. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతపరిచే క్రమంలో డబ్ల్యూహెచ్‌వో యంత్రాంగం స్పందించిన తీరుతెన్నులపైనా మదింపు జరగాలని తీర్మానంలో ప్రస్తావించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు