ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద డ్రోన్

శుక్రవారం, 2 జులై 2021 (14:52 IST)
పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారతదేశంలో ఏదో రూపంలో విధ్వంసం సృష్టించాలని కొత్తకొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇపుడు కొత్తగా డ్రోన్ టెక్నాలజీని ఎంచుకున్నారు. ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దు ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో డోన్లు కలకలం సృష్టించాయి. అలాగే, కాశ్మీర్‌లోని భారత వైమానిక స్థావరంపై డ్రోన్ సాయంతో దాడి చేయగా, ఎయిర్‌పోర్టు పైకప్పు దెబ్బతింది. 
 
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ లో ఉన్న భారత హైకమిషన్ వద్ద డ్రోన్ కలకలం రేగింది. ఓ డ్రోన్ హై కమిషన్ ఆఫీసుపైన చక్కర్లు కొట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించి పాక్ ప్రభుత్వానికి హైకమిషన్ అధికారులు నిరసన తెలిపినట్టు చెబుతున్నారు. భద్రత ఇంత గాలిబుడగలా ఉండడాన్ని నిలదీసినట్టు సమాచారం.
 
ఆదివారం అర్థరాత్రి రెండు డ్రోన్లు జమ్మూలోని ఐఏఎఫ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై ఐఈడీ పేలుడు పదార్థాలను వదిలిన సంగతి తెలిసిందే. ఘటనలో ఒక సిబ్బంది గాయపడ్డారు. మిగతా పరికరాలకు ఏ నష్టం జరగకపోయినా.. ఓ భవనం పైకప్పు దెబ్బతింది. ఆ తర్వాత కూడా జమ్మూలో డ్రోన్ల సంచారం ఎక్కువైంది. వరుసగా ఆకాశంలో డ్రోన్లు కనిపిస్తున్నాయి. శుక్రవారం కూడా అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించింది.
 
దీని వెనుక ఉగ్రవాదులున్నారని ఇప్పటికే అధికారులు తేల్చారు. ఆ డ్రోన్లను వారికి సమకూరుస్తున్నది పాక్ ప్రభుత్వమేనన్న ఆరోపణలున్నాయి. ఇంత టెక్నాలజీ రోడ్డు పక్కన తయారయ్యేది కాదని, పాక్ ప్రభుత్వ సహకారం లేనిదే వారికి డ్రోన్లు దొరకవని ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి