ప్రకృతి వైపరీత్యం.. ఎడారి దేశంలో వేసవి వర్షాలు.. నీట మునిగిన దుబాయ్ రోడ్లు

వరుణ్

బుధవారం, 17 ఏప్రియల్ 2024 (09:45 IST)
ప్రకృతి వైపరీత్యాలు ఎంత దారుణంగా ఉంటాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎడారి దేశంలో వేసవి వర్షాలు పడ్డాయి. అదీ కూడా కుండపోత వర్షం. దీంతో ఎడారి దేశమైన దుబాయ్ రోడ్లు, వీధులు, విమానాశ్రయాలు, బస్టాండ్లు ఇలా ప్రతిదీ నీటమునిగిపోయింది. మంగళవారం ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన దుబాయ్ విమానశ్రయంలో ఆకస్మిక వరద విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పలు సర్వీసులు రద్దయ్యాయి.
 
భారీ వర్షం కారణంగా దుబాయ్ మొత్తం అస్తవ్యవస్థమైంది. పలు షాపింగ్ మాల్స్‌లోకి మోకాలిలోతు వరకూ నీరు చేసింది. అనేక రోడ్లు కొట్టుకుపోయాయి. పలు రెసిడెన్షియల్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్ల పైకప్పులు, తలుపులు, కిటికీల నుంచి నీరు కారుతున్న దృశ్యాలు అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. వరద దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణమార్పులపై ఆందోళన రెకెత్తించాయి.
 
ఈ వర్షం ప్రభావం దుబాయ్‌తో పాటూ యావత్ యూఏఈ, పొరుగున ఉన్న బాహ్రెయిన్ వరకూ కనిపించింది. అక్కడ అనేక ప్రాంతాలను వరద ముంచేసింది. అన్ని ఎమిరేట్స్‌లలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండంతో ప్రభుత్యం తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. ఇక ఒమాన్ వర్షం బీభత్సానికి పిల్లలతో సహా మొత్తం 18 మంది కన్నుమూశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు