ఈజిప్టులో వినూత్న చట్టం.. భార్యలను కొడితే మూడేళ్ల జైలు శిక్ష

బుధవారం, 27 జనవరి 2021 (10:05 IST)
ఓ వినూత్న చట్టం గురించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భార్యలను కొట్టి, హింసింసే భర్తలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టానికి రూపకల్పన జరుగుతోంది. జరిమానాలను కూడా విధించేలా ఆ చట్టంలో అంశాలను రూపొందించారు. అయితే ఆ చట్టం చేస్తుంది మన దేశంలో కాదు. మహిళలకు రక్షణ కల్పించే దిశగా ఈజిప్టులో ఆ ప్రయత్నం జరుగుతోంది. 
 
ఇళ్లల్లో మహిళలకు రక్షణ కల్పించే దిశగా ఆ దేశ ఎంపీ అమల్ సలమా తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని ఆమె రూపొందిస్తున్నారు. ఏ కారణంతో అయినా సరే భార్యలను కొట్టేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా, జరిమానా విధించేలా చట్టంలో పలు అంశాలను ఆమె పొందుపరుస్తున్నారు. 
 
దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే ఈజిప్టు పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామనీ, సభ్యుల మద్ధతును కూడగడతానని అమల్ సలమా చెబుతున్నారు. 'హింసించడం, కొట్టడం చేసే మగాళ్లు భార్యల దృష్టిలో బలవంతులు, గొప్పవాళ్లు అని భర్తలు ఫీలవుతుంటుంటారు.
 
అందుకే అకారణంగా వారిని హింసిస్తుంటారు. ఈజిప్టులోనే కాదు, పలు దేశాల్లో ఇప్పటికీ స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. ఇది గ్రామీణ కుటుంబాల్లో మరీ విపరీత స్థాయిలో ఉంది. భర్తలు పెట్టే హింసను భరించలేక భార్యలు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. 
 
స్త్రీలకు రక్షణ, ధైర్యం కల్పించేందుకే ఈ చట్టానికి రూపకల్పన చేయాలనుకున్నా. ఏది ఏమైనా త్వరలోనే దీన్ని పార్లమెంట్ ఆమోదించేలా కృషి చేస్తా' అని అమల్ సలమా చెప్పుకొచ్చారు. ఈజిప్టులో రూపకల్పన జరుగుతున్న ఇలాంటి చట్టం భారత్‌లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని సగటు భారతీయ మహిళలు నెట్టింట డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు