ఇథియోపియాలో విమాన ప్రమాదంలో 157 మంది మృతి... మృతుల్లో గుంటూరు అమ్మాయి మనీషా

సోమవారం, 11 మార్చి 2019 (10:16 IST)
ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో బోయింగ్‌ 737-8 మ్యాక్స్‌ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు తెలుగమ్మాయితో పాటు నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. 
 
ఇథియోపియాకు చెందిన ఎయిర్‌లైన్ విమానం బోయింగ్ 737-800 మాక్స్ ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8.38 గంటలకు రాజధాని అడ్డిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన ఆరు నిమిషాలకే విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటన బిషఫ్‌తు ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై ఎయిర్‌లైన్స్ అధికార వర్గాలు మాట్లాడుతూ విమానం గాలిలోకి ఎగిరిన ఆరునిమిషాలకే కుప్పకూలిందని తెలిపాయి. ఉదయం 8.44 గంటలకు ప్రమాదం సంభవించిందని చెప్పాయి. 
 
మరోవైపు ఇథియోపియా అధికార వార్త సంస్థ ఈబీసీ స్పందిస్తూ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని తెలిపింది. ప్రమాద ఘటనపై ఇథియోపియా ప్రధాని కార్యాలయం స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొంది. రవాణా శాఖ మంత్రి జేమ్స్ మచారియా మాట్లాడుతూ ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సేవలను ప్రారంభించామని చెప్పారు. 
 
మరణించిన వారిలో కెన్యాకు చెందిన 32 మంది, ఇథియోపియా 9 మంది, కెనడా 18 మంది, చైనా, అమెరికా, ఇటలీకి చెందిన 8 మంది చొప్పున, ఫ్రాన్స్‌కు చెందిన 7 మంది, బ్రిటన్ 7 మంది, ఈజిప్టు 6 మంది, నెదర్లాండ్‌కు చెందిన ఐదుగురు, భారత్, జకస్లోవేకియాకు చెందిన నలుగురు చొప్పున ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన 12మంది కూడా మరణించినవారిలో ఉన్నారు.
 
కాగా, ప్రమాదాన్ని పైలట్ ముందే గుర్తించాడు. విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, విమానాన్ని వెనక్కి మళ్లిస్తానని బోయింగ్ పైలట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు కూడా విమానాన్ని వెనక్కి తీసుకురావడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
 
కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగమ్మాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన యువతి నూకవరపు మనీషాగా అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్‌బీబీఎస్‌ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది. నైరోబిలోని తన అక్కను చూడడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మనీషా మృతితో ఉంగుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు