బోయింగ్ స్పేస్ క్యాప్సుల్ సురక్షితంగా భూమికి చేరుస్తుంది : సునీతా విలియమ్స్

వరుణ్

గురువారం, 11 జులై 2024 (17:33 IST)
బోయింగ్ సంస్థ తయారు చేసిన వ్యోమనౌక (స్పేస్ క్యాప్సుల్) తమను సురక్షితంగా భూమికి చేర్చగలదన్న నమ్మకం తమకుందని అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ అన్నారు. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సులు పరీక్షించేందుకు సునీతా, బుచ్ అంతరిక్ష యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇరు వ్యోమగాములు స్టార్ లైనర్‌లో స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు.
 
రెండు వారాల క్రితమే వారు భూమికి తిరిగి రావాల్సిన ఉండగా పలు సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడుతూవస్తోంది. కాగా, వారు ఎప్పుడు తిరిగిరావాలన్న దానిపై తాము ఎటువంటి తేదీ నిర్ణయించలేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. వారి తిరుగు ప్రయాణంపై తొందరేమీ లేదని స్పష్టం చేసింది.
 
కాగా, జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్, బుచ్ అంతరిక్ష యాత్రను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఐఎస్ఎస్ చేరుకునే క్రమంలో స్టార్‌లైన్‌లో హీలియం వాయువు లీకవడాన్ని గుర్తించారు. క్యాప్సుల్ దిశను మార్చే థ్రస్టర్లలో హీలియంను వినియోగిస్తారు. అయితే, వ్యోమగాములు తిరిగొచ్చేందుకు ఈ సమస్య అడ్డంకి కాబోదని నాసా తెలిపింది. కానీ, ఈ సమస్యపై మరింత సమాచారం సేకరించాకే తాము వ్యోమగాములను తిరిగి భూమికి చేరుస్తామని నాసా స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు