పాఠశాల బాలికల వాష్‌రూంలో రహస్య కెమెరా... వీడియోలు తీసింది ఎవరు?

శనివారం, 6 నవంబరు 2021 (08:21 IST)
ఇటీవలి కాలంలో దాయాది దేశం పాకిస్థాన్‌లో అరాచకాలు హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్యకు అడ్డేలేకుండా పోతోంది. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలికల వాష్‌రూం‌లో రహస్య కెమెరాలు అమర్చిన విషయాన్ని గుర్తించారు. ఈ కెమెరాల ద్వారా బాలికలు, మహిళా టీచర్ల వీడియోలను తీశారు. ఈ ఉదంతం పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో వెలుగుచూసింది.
 
బాలికల ప్రైవేటు పాఠశాల వాష్‌రూమ్‌లలో కెమెరాలు ఉన్నాయని చాలా మంది మహిళా టీచర్లు, బాలికలు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో సింధ్ విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. ప్రైవేటు పాఠశాలలోని వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రీకరిస్తున్నారని విద్యా శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో సింధ్ విద్యా శాఖ ఆ ప్రైవేటు పాఠశాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఇదిలావుంటే, వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఉదంతం పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. దీంతో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి రికార్డు చేసిన వీడియోలపై దర్యాప్తు సాగిస్తోంది. వాష్ రూంలలో మహిళా టీచర్లు, విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించారని సింధ్ విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. 
 
దీంతో తాము ఈ వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటామని సింధ్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్రైం జోన్ హెడ్ ఇమ్రాన్ రియాజ్ చెప్పారు. కాగా పాఠశాల వాష్ రూంలలో పర్యవేక్షణ కోసమే తాము కెమెరాలు అమర్చామని పాఠశాల అడ్మినిస్ట్రేషన్ పేర్కొనడం ఇపుడు పెను దుమారానికి దారితీసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు