అమెరికాలో హైదరాబాద్ టెక్కీ అనుమానాస్పద మృతి

శనివారం, 23 జూన్ 2018 (12:12 IST)
అమెరికాలో మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ టెక్కీ హైదరాబాద్ వాసి. పేరు అంబారిపేట కృష్ణప్రసాద్. వయసు 34 యేళ్లు. హైదరాబాద్ రామాంతపూర్ ప్రగతినగర్‌ నివాసి. ఈయన ఈనెల 21వ తేదీన చికాగోలోని తన నివాసంలో చనిపోయి కనిపించాడు. విషయం తెలుసుకున్న చికాగో పోలీసులు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
నిజానికి కృష్ణప్రసాద్ ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్‌కు తన భార్యాపిల్లలతో వచ్చాడు. వారిని ఇక్కడే వదిలిపెట్టి మళ్లీ యూఎస్‌ ఫ్లైట్ ఎక్కాడు. వారం రోజుల క్రితం చికాగో వెళ్లిన ఆయన అలా వెళ్లిన మూడు రోజులకే ఇంట్లో శవమై కనిపించటం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. 
 
వాస్తవానికి మరో వారం రోజుల్లో కృష్ణప్రసాద్ భార్యాపిల్లలు కూడా అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఇంతలోనే తన ఇంట్లో కృష్ణప్రసాద్ శవమై కనిపించడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 
 
కుటుంబంలో గొడవలు ఏమైనా ఉన్నాయా? లేక ఉద్యోగ ఒత్తిడి ఉందా? అనే కోణంలోనూ అమెరికాలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి అమెరికా పోలీసుల నుంచి ఆయన తండ్రి రాంప్రసాద్‌కు సమాచారం వచ్చింది. మృతదేహం సోమవారం నాటికి హైదరాబాద్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు