పాకిస్థాన్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. ఆ దేశ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు కిడ్నాప్కు గురయ్యారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబం లక్ష్యంగా జరిగినట్లు భావిస్తున్న ఓ ఘటనలో, ఆయన మేనల్లుడు షహ్రీజ్ ఖాన్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. లాహోర్లోని తన నివాసం నుంచే గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో పాక్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు లాహోర్లోని షహ్రీజ్ ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించారని, అక్కడి సిబ్బందిపై దాడి చేశారని ఆయన పార్టీ న్యాయవాది రాణా ముదస్సార్ ఉమర్ తెలిపారు. అంతేకాకుండా, షహ్రీజన్ను ఆయన ఇద్దరు పిల్లల కళ్లెదుటే హింసించి, బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. షహ్రీజ్ ఖాన్, ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ కుమారుడు. ఆయనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన పేరుపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ లినెన్ కంపెనీకి ప్రాంతీయ అధిపతిగా ఆయన పనిచేస్తున్నారని వివరించారు.
ఈ కిడ్నాపు ఒకరోజు ముందే, షహ్రీజన్ను తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లకుండా లాహోర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారని, బలవంతంగా విమానం నుంచి దించేశారని ఆయన పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనపై ఖైబర్ ఫంఖువా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ తీవ్రంగా స్పందించారు. షహ్రీజ్ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తరచూ దేశ సైన్యాన్ని, ప్రభుత్వ అధికారులను విమర్శిస్తుండటం గమనార్హం.
కాగా, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. పలు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ, మరికొన్ని కేసులు పెండింగ్ ఉండటంతో ఆయన విడుదల కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.