ఆప్ఘాన్‌లో ఎంబసీని ఖాళీ చేసిన భారత్ - హెల్ప్‌ లైన్ నంబర్ ఏర్పాటు

మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:12 IST)
తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశంలో రాజకీయ సంక్షోభం ఉత్పన్నమైంది. ప్రస్తుతం ఆ దేశంలో భయానకమైన పరిస్థితులు నెలకొనివున్నాయి. ఎపుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. 
 
గతంలో మాదిరి కాకుండా, మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెపుతున్నప్పటికీ... వారి మాటలను ఆఫ్ఘన్ ప్రజలు కూడా నమ్మడం లేదు. భవిష్యత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
మరోవైపు, ఆప్ఘాన్‌లో పరిస్థితులు చేయిదాటిపోవడంతో కాబూల్‌లోని ఎంబసీని భారత్ ఖాళీ చేసింది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కాబూల్‌కు అత్యవసరంగా పంపించారు. ఈ ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘన్‌లోని భారత రాయబారి, ఇతర సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ట్రూపులను స్వదేశానికి తీసుకునిరానున్నారు. 
 
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిదమ్ బగ్చి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆప్ఘాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మన రాయబారితో పాటు ఎంబసీ మొత్తం సిబ్బందిని తక్షణమే స్వదేశానికి రప్పించాలని నిర్ణయించామని తెలిపారు. ఆప్ఘన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం హెల్స్‌లైన్ నంబర్ 919717785379ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
 
కాబూల్ ఎయిర్ పోర్టులో సోమవారం రుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వేలాది మంది ఎయిర్ పోర్టులోకి చొచ్చుకొచ్చి దేశం నుంచి బయటకు వెళ్లిపోయేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారిని నియంత్రించేందుకు అమెరికా సైన్యం కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఉదయం నుంచి కాబూల్‌ నగరంలో కర్ఫ్యూ విధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు