2019 భారత గణతంత్ర వేడుకలకు డొనాల్డ్ ట్రంప్ వస్తారా?

శుక్రవారం, 13 జులై 2018 (18:00 IST)
2019 భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిసింది. ఈ మేరకు భారత సర్కారు ట్రంప్‌ను గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. కానీ ఈ ఆహ్వానంపై వైట్ హౌస్ స్పందించలేదు. భారత ఆహ్వానం మేరకు ట్రంప్ కనుక వేడుకలకు హాజరైతే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తర్వాత వచ్చిన రెండో వ్యక్తి అవుతారు. 
 
2015 గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒబామాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికా- భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాలు, రష్యాతో ఆయుధ డీల్‌పై అమెరికా గుర్రుగా ఉంది.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవుతారా అనేది అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఒకవేళ భారత ఆహ్వానం మేరకు ట్రంప్ విచ్చేస్తే తిరిగి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారత రిపబ్లిక్ డే వేడుకలకు 2016లో అప్పటి ఫ్రెంచ్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలండ్ హాజరు కాగా, 2017లో అబుదాబి ప్రిన్స్ హాజరైన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు