చంద్రయాన్-5 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాగతించారు. LUPEX (లునార్ పోలార్ ఎక్స్ప్లొరేషన్) మిషన్ కింద చంద్రయాన్-5 అనేది చంద్రుని దక్షిణ ధ్రువం, దానిలో దాగి ఉన్న వనరులను, చంద్రుని నీటిని అన్వేషించడం లక్ష్యంగా ఇస్రో-JAXA సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇది చంద్రయాన్ సిరీస్ చంద్ర మిషన్లలో ఐదవ మిషన్ అవుతుంది.
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చల తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "చంద్రయాన్-5 మిషన్ కోసం ఇస్రో, JAXA మధ్య సహకారాన్ని మేము స్వాగతిస్తున్నాము. మా క్రియాశీల భాగస్వామ్యం భూమి పరిమితులను దాటిపోయింది. అంతరిక్షంలో మానవాళి పురోగతికి చిహ్నంగా మారుతుంది" అని అన్నారు.
ఇస్రో మరియు JAXA మధ్య ఉమ్మడి చంద్ర ధ్రువ అన్వేషణ మిషన్ (LUPEX) కోసం అమలు ఒప్పందం.. ఒక మైలురాయి. LUPEX పై అమలు ఒప్పందాన్ని JAXA ఉపాధ్యక్షుడు మత్సురా మయూమి రాయబారి సిబి జార్జ్ అందుకున్నారు. 2023లో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర చంద్రయాన్-3 విజయవంతంగా దిగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రశంసలను ప్రస్తావిస్తూ, తదుపరి సవాలు చంద్రుని ఉపరితలంపై, ముఖ్యంగా నీటి మంచు వంటి కీలకమైన వనరులను కలిగి ఉండే ప్రాంతాలను లోతుగా అన్వేషించడం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
"జపాన్ టెక్నాలజీ, భారతీయ చాతుర్యం విజయవంతమైన కలయిక అని మేము నమ్ముతున్నాము. మేము హై-స్పీడ్ రైలుపై పని చేస్తున్నాము, నెక్స్ట్ జనరేషన్ మొబిలిటీ పార్టనర్షిప్ కింద ఓడరేవులు, విమానయానం, నౌకానిర్మాణం వంటి రంగాలలో కూడా వేగవంతమైన పురోగతిని సాధిస్తాము. చంద్రయాన్ 5 మిషన్లో సహకారం కోసం ఇస్రో, JAXA మధ్య కుదిరిన ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము..." అని ప్రధానమంత్రి అన్నారు.
15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా శుక్రవారం ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు. దీని తరువాత అధునాతన సాంకేతికత, అంతరిక్షం సహా బహుళ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరు పక్షాలు ఒప్పందాలను మార్చుకున్నాయి.