పాక్‌లో టమోటాల సంక్షోభం.. భారత్‌పై బాంబులు వేయమంటున్న జర్నలిస్టులు

సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:54 IST)
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పీచమణిచేందుకు భారత్ కఠిన వైఖరిని అవలంభిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే పాక్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతానికి పెంచింది. అలాగే, పాకిస్థాన్‌పై జలాస్త్రాన్ని సంధించింది. అంతర్జాతీయపరంగా దౌత్య యుద్ధం  ప్రారంభించింది. దీంతో సరిహద్దు గ్రామాలకు చెందిన భారతీయ రైతులు పాకిస్థాన్‌కు ఎగుమతి చేసే టమోటాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో దాయాది దేశంలో టమోటాల సంక్షోభం ఏర్పడింది. టమోటాలు దొరక్కా ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కిలో టమోటాల ధర ఏకంగా రూ.300కి పైగానే పలుకుతోంది.
 
ఈ చర్యను పాక్ ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు. టమోటాల ఎగుమతిని ఆపేసిన భారత్‌పై అణుబాంబు వేయాలని లాహోర్‌లోని 'సిటీ 42 టీవీ' జర్నలిస్టు ఒకరు ఆక్రోశం వ్యక్తంచేశాడు. టమోటాల సరఫరా నిలిపివేసినందుకు ప్రతిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ ముఖాలపై టమోటాలు విసిరికొట్టాలని మండిపడ్డాడు. తప్పైపోయిందని భారత్ వెయ్యిసార్లు అనేలా చేస్తామని హెచ్చరించాడు. పాక్ జర్నలిస్టు వ్యాఖ్యలపై భారత నెటిజన్లు నవ్వుపుట్టించే కామెంట్లు చేస్తున్నారు. 'భలే జోక్' బ్రదర్ అని కొందరు అంటుండగా, ఒక్క టమోటాలు ఆపేస్తేనే పాక్ విలవిల్లాడిపోతోందని, మున్ముందు మరిన్ని వస్తువులు నిలిపివేస్తే పాక్ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందోనని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు