అమెరికా భారత దంపతుల హత్య.. బాల్కనీలో నాలుగేళ్ల పాప ఏడుస్తూ..?

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:00 IST)
అగ్రరాజ్యం అమెరికాలో భారత్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారు నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్టాట్‌లో రక్తపు మడుగులో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

ఇండియన్ టెక్కీ దంపతుల నాలుగేళ్ల కుమార్తె బాల్కనీలో చాలాసేపటి వరకు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
 
మృతుల పేర్లు బాలాజీ భరత్ రుద్రవర్.. ఆయన భార్య ఆరతీ బాలాజీ రుద్రవర్. న్యూజెర్సీ శివార్లలోని నార్త్ అర్లింగ్టన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో వారు నివసిస్తున్నారు. బాలాజీ రుద్రవర్ స్వస్థలం మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగై. ఆయన తండ్రి భరత్ రుద్రవర్ వృత్తిరీత్యా వ్యాపారి. 2014లో అదే జిల్లాకు చెందిన ఆర్తీతో బాలాజీకి వివాహమైంది. ఆ మరుసటి ఏడాది ఆయన భార్యతో సహా అమెరికా వెళ్లారు. న్యూ అర్లింగ్టన్‌ రివర్‌ వ్యూ గార్డెన్స్ కాంప్లెక్స్‌లోని 21 గార్డెన్ టెర్రస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. 2017లో వారికి కుమార్తె జన్మించింది.
 
తన ఫ్లాట్‌లో బాలాజీ దంపతులిద్దరూ అనుమానాస్పదంగా మరణించారు. పోలీసులు వారి మృతదేహాలను రక్తపు మడుగలో పడి ఉన్న స్థితిలో స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీన్ని పోలీసులు ఇంకా ధృవీకరించట్లేదు. ఇంట్లో గొడవ చోటు చేసుకుందనడానికి అవసరమైన సాక్ష్యాధారాలు లభించాయని పోలీసులను ఉటంకిస్తూ అక్కడి మీడియా కథనాలను ప్రచురించింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ అందిన తరువాతే.. అది హత్య లేదా ఇంకేదైనా అనేది నిర్ధారిస్తామని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిపింది.
 
బాలాజీ భరత్ దంపతుల నాలుగేళ్ల కుమార్తె బాల్కనీలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి ఏడుస్తోన్న విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు బాలాజీకి ఫోన్ చేయగా.. అతను రిసీవ్ చేసుకోలేదు. ఇంటికెళ్లి తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. దీనితో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అంబాజోగైలో ఉన్న ఆయన తండ్రికి సమాచారం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు