'ఫలరాజం' వాసనకు బెంబేలెత్తిపోయిన విమాన ప్రయాణికులు...

గురువారం, 8 నవంబరు 2018 (12:19 IST)
ఫలరాజం పండ్ల నుంచి వచ్చిన వాసనకు విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఆ పండ్లను విమానం నుంచి అన్‌లోడింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా, ఆ పండ్లను దించేసిన తర్వాత విమానం ముందుకు కదిలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సోమవారం ఇండోనేషియా సుమత్రాలోని బెంగ్‌కులు నుంచి జకర్తా వెళ్లేందుకు శ్రీ విజయ ఎయిర్ ఫ్లైట్‌ సిద్ధంగా ఉంది. ఈ విమానంలో ప్రయాణికులు ఎక్కి కూర్చగా, కొన్ని రకాల సరకులు, పండ్లను కూడా లోడింగ్ చేశారు. ఇలాంటివాటిలో డురియన్ పండ్లు కూడా ఉన్నాయి. వీటి కారణంగా ఈ విమానం ఉన్నఫళంగా నిలిపి వేయాల్సి వచ్చింది. 
 
ఆ పండ్ల నుంచి దుర్గంధం వెదజల్లు తుండటంతో ప్రయాణికులంతా ముక్కులు మూసుకుని ఉక్కిరిబిక్కిరయ్యారు. వాటిని దించేస్తే తప్ప విమానం ఎక్కబోమని వారంతా పట్టుబట్టడంతో.. అధికారులు హుటాహుటిన పండ్లను ఖాళీచేసేశారు. సుమారు గంటసేపటి హైడ్రామా తర్వాత గానీ విమానం బయల్దేరి వెళ్లింది. 
 
నిజానికి పనస పండు మాదిరిగా ఉండే డురియన్ పండ్లను ఉష్ణమండల ఫలాలుగా పిలుస్తారు. ఇది కుళ్లిన మురుగు వాసన వస్తుంది. అయితే రుచి మాత్రం మధురంగా ఉండటంతో దీన్ని కొందరు ఫలరాజంగా పిలుస్తారు. సాధారణంగా ఈ పండ్లను ప్యాక్ చేసేటప్పుడే పాండాన్ ఆకులు, కాఫీ పౌడర్ వంటివి  ఉపయోగిస్తారు. అయితే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా విమానంలో ఎక్కించిన డురియన్ పండ్లు వాసన వెదజల్లినట్టు శ్రీవిజయ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ప్రయాణికుల రక్షణ దృష్ట్యా ఈ పండ్లను అన్‌లోడింగ్ చేసినట్టు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు