కాబూల్‌లోని గురుద్వారపై ఉగ్రమూకల దాడి-25మంది మృతి

బుధవారం, 25 మార్చి 2020 (15:45 IST)
కాబూల్‌లోని గురుద్వారపై ఉగ్రమూకలు దాడి చోటుచేసుకుంది. ఆప్ఘనిస్థాన్ రాజధాని అయిన కాబూల్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 25 మందికి పైగా మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కాబూల్‌లోని షోర్‌ బజార్‌ ప్రాంతంలోని గురుద్వార లక్ష్యంగా బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. 
 
భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ 11 మందిని పొట్టనబెట్టుకున్నట్లు పేర్కొంది. షోర్‌ బజార్‌లోని ధరమ్‌శాలలో ఆత్మాహుతి దళాలు దాడులకు పాల్పడ్డాయి. గురుద్వార లోపల చిక్కుకుపోయిన సిక్కులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ఈ దాడులతో ఎటువంటి సంబంధం లేదని తాలిబన్‌ సంస్థ ప్రకటించింది. కాగా ఆప్ఘన్‌లో సిక్కులపై దాడిని భారత గృహ, పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తీవ్రంగా ఖండించారు.

మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు చెప్తున్నారు. కాల్పుల విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమైనాడు. ఇకపోతే.. కాల్పులు జరిపింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. 
 
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న సమయలో ఇలాంటి దాడులు క్రూరమని భారత్ మండిపడింది. ఆప్ఘనిస్థాన్‌లో హిందువులు, సిక్కుల రక్షణకు అవసరమైన సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. గతంలో కూడా ఆప్ఘనిస్థాన్‌లో సిక్కులపై దాడి సంఘటనలో 19 మంది మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు