మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యంతా ఒక్కటే.. అదే కాశ్మీర్ : ఇమ్రాన్ ఖాన్

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:31 IST)
ప్రపంచంలో దాయాది దేశాలుగా ఉన్న భారత్ - పాకిస్ధాన్ దేశాల మధ్య సుధీర్ఘకాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్య కాశ్మీర్ సమస్య. కాశ్మీర్ భారత్‌లో అంతర్భగంగా ఉంది. కానీ, పాకిస్థాన్ మాత్రం తమ ప్రాంతమని వాదిస్తోంది. పైగా, కాశ్మీర్ సమస్యను కేంద్రంగా చేసుకుని పలుమార్లు కయ్యానికి కూడా కాలుదువ్వింది. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సమస్య కేవలం కాశ్మీరేనని, భారత్‌తో తమకున్న వివాదాలు దానిపైనేనని స్పష్టం చేశారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీలంక-పాకిస్థాన్ వాణిజ్యం, పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సతో కలిసి సమావేశంలో మాట్లాడారు.
 
తాను అధికారంలోకి రాగానే భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడానని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పానని అన్నారు. అయితే, ఆ విషయంలో తాను విఫలమయ్యానని, ఎప్పటికైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని తేల్చి చెప్పింది. 'చర్చలపై మాది ఒకే ఒక్క మాట. పాక్‌తో మంచి సంబంధాలనే మేమూ కోరుకుంటాం. కానీ, ఉగ్రవాద నిర్మూలన, యుద్ధ వాతావరణం, హింస లేకుండా చూసినప్పుడే అది సాధ్యమవుతుంది' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు