ఈసారి లేపేస్తాం : మలాలాకు ఎక్కువైన బెదిరింపులు

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (12:51 IST)
పాకిస్థాన్‌లో బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ ‌జాయ్‌కు తాలిబన్ ఉగ్ర సంస్థ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. వీటిని ఓ ట్వీట్ ద్వారా చేశారు. ఈ సారి తమ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తొమ్మిదేళ్ల క్రితం మలాల మీద కాల్పులు జరిపిన పాకిస్థాన్‌ తాలిబన్‌ సంస్థ, మరోసారి ఈ మేరకు బెదిరింపులు జారీ చేసింది. 
 
అయితే, ఇందుకు సంబంధించిన ట్వీట్‌పై బుధవారం నిషేధం విధించారు. కాగా 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్థాన్‌లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు. 
 
కాగా, ఈ దాడికి పాల్పడిన ఎహ్సాన్‌ను 2017లో అరెస్టు చేశారు. అయితే  2020 జనవరిలో అతన్ని పట్టుకున్న పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి తప్పించుకున్నాడు. అంతేగాక అతని అరెస్టు, తప్పిదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక మలాలకు వచ్చిన హెచ్చరికలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ప్రధాని సలహాదారు రౌఫ్ హసన్ తెలిపారు. కాగా అనేక సంవత్సరాలు సైనిక కస్టడీలో ఉన్న ఎహ్సాన్‌ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడో, అక్కడి నుంచి టర్కీకి ఎలా వెళ్లాడో కూడా అధికారులు వెల్లడించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు