బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కొత్త స్ట్రెయిన్.. తెలంగాణలో 16 మందికి పాజిటివ్

శుక్రవారం, 25 డిశెంబరు 2020 (19:02 IST)
బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది. డిసెంబర్ 9వ తేదీ నుండి ఇప్పటి వరకు 1200 మంది యూకే నుండి తెలంగాణకు వచ్చారు.. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించారు అధికారులు.
 
పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్‌లో నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందినవారు ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున పాజిటివ్‌గా తేలింది. ఇక ఆ 16 మందికి 76 మంది అతిసన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.. మరోవైపు ఆ 16 మందిలో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి సీసీఎంబీకి శ్యాoపిల్స్ పంపామని.. మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.
 
ఇక, పాజిటివ్‌గా తేలిన ఆ 16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచామని వైద్యశాఖ ప్రకటించింది.. వారికి అత్యంత సన్నిహితంగా ఉన్న 76 మందిని కూడా గుర్తించి క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించింది. 
 
డిసెంబర్ 9వ తేదీ తర్వాత రాష్ట్రానికి నేరుగా యూకే నుండి వచ్చిన వారు లేదా యూకే మీదుగా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నెంబర్‌కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని విజ్ఞప్తి చేసింది వైద్య ఆరోగ్యశాఖ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు