ఇంగ్లండ్‌లో కొత్త రకం వైరస్.. అమ్మా వెయ్యి మందికి సోకిందా?

మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:55 IST)
లండన్‌‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌లో కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు వెయ్యి మందిలో ఈ కొత్త రకం వైరస్‌‌ను గుర్తించారు. ఇంగ్లాండ్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌‌పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొత్త రకం వైరస్‌‌పై బ్రిటన్ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 
 
ప్రస్తుతం బ్రిటన్‌లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌‌ల కంటే ఈ కొత్తరకం వైరస్‌ భిన్నంగా వ్యవహరిస్తుందనడానికి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై పరిశోధకులు మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు. 
 
సమయం గడుస్తున్న కొద్దీ వైరస్‌ రూపాంతరం చెందుతోందని అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో కొత్త రకం వైరస్‌‌పై తీవ్ర ఆందోళన నెలకొందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా గుర్తించిన కరోనా వైరస్‌ రకమే వేగవంతమైన వ్యాప్తికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లో మూడో అంచె ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
థియేటర్లు, పబ్‌‌లు, రెస్టారెంట్లు, సహా ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలను మూసివేయనున్నారు. గతవారమే బ్రిటన్‌లో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమయింది. ఫైజర్‌ రూపొందించిన కరోనా టీకాను తొలి విడతలో వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు