కరోనా భయం :: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు!

మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:44 IST)
కరోనా వైరస్ భయం కారణంగా ఈ యేడాది జరగాల్సిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు అయ్యాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కరోనా ప్రకంపనలు రేపిన నేపథ్యంతోపాటు, దేశంలో ఇంకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నట్లు సమాచారం. 
 
సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై వివరణ ఇచ్చారు. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.
 
ఇదిలావుంటే, రైతుల ఆందోళన, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీతో సహా పలు అంశాలపై చర్చించడానికి శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ రంజన్ గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. 
 
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు శీతాకాల సెషన్‌ను అన్ని కోవిడ్‌-19 ప్రోటోకాల్‌తో ఏర్పాటు చేయాలని బిర్లాకు రాసిన లేఖలో ఆయన కోరారు. కానీ, కేంద్రం ఏకంగా సమావేశాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు