సర్జికల్ స్ట్రైక్స్ ఎఫెక్ట్ : ఐఎస్ఐ చీఫ్‌ను ఇంటికి పంపనున్న పాకిస్థాన్

శనివారం, 8 అక్టోబరు 2016 (17:50 IST)
భారత్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రభావం పాకిస్థాన్‌పై బాగానే పడినట్టు తెలుస్తోంది. దీంతో పదవీకాలం ముగియకముందే.. పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్‌ను ఇంటికి పంపాలని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భావిస్తున్నారు.
 
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పదవీ కాలం మరికొంత కాలం ఉంది. అయితే, పదవీ కాలం ముగియకముందే ఇంటికి సాగనంపాలని పాక్ యోచిస్తోంది. అప్పటి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జహీరుల్ ఇస్లాం పదవీ కాలం ముగియడంతో 2014లో అక్తర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
 
ఐఎస్ఐ చీఫ్ రిటైర్ అయినా, ఆర్మీచీఫ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేస్తే తప్ప ఐఎస్ఐ చీఫ్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. అయితే ఇవేవీ జరగకుండానే అక్తర్‌ను పదవి నుంచి తప్పించనున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానాన్ని కరాచీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్‌తో భర్తీ చేయనున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి