కాశ్మీర్‌కు అండగా నిలిచిన దేశాల ప్రర్యటనకు ప్రధాని మోడీ

సోమవారం, 19 ఆగస్టు 2019 (12:52 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చిన 370వ అధికరణను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని రాజకీయం చేసి అంతర్జాతీయం చేయాలని పాకిస్థాన్ ఎత్తుకు పైఎత్తులు వేసింది. కానీ, పాకిస్థాన్ విసిరిన పాచికలు పారలేదు. ఇదే క్రమంలో కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమంటూ అనేక ముస్లిం దేశాలతో పాటు.. పలు దేశాలు స్పష్టం చేశాయి. 
 
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23 నుంచి యూఏఈ, బెహ్రయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. కాశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యూఏఈ బహిరంగ మద్దతు ప్రకటించిన నేపథ్యంలోనే ప్రధాని అబూదాబి వెళ్లనుండటం గమనార్హం. భారత్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పాకిస్థానీయులను బెహ్రయిన్ ప్రభుత్వం సైతం అడ్డుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నెల 24-25 తేదీల్లో ప్రధాని బెహ్రయిన్ వెళ్లనున్నారు. భారత ప్రధాని బెహ్రయిన్ పర్యటనకు వెళ్లనుండడం ఇదే మొదటి సారి కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థానీయులు సహా కొందరు బంగ్లాదేశీయులు వ్యతిరేకించడంపై బెహ్రయిన్ గత వారంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈద్ ప్రార్థనలు ముగియగానే బెహ్రయిన్‌లో ర్యాలీ జరిగింది. దీనిపై తీసుకున్న చర్యలను బెహ్రయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ట్విటర్లో వెల్లడిస్తూ.. ఆందోళనకారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాగా కశ్మీర్ విషయంలో తమకు అండగా నిలవాలంటూ గతవారం బెహ్రయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను కోరిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు