చైనాలో కరోనా: పోలీసులకు స్మార్ట్ హెల్మెట్లు.. శరీర ఉష్ణోగ్రతలను..?

ఆదివారం, 8 మార్చి 2020 (11:55 IST)
కరోనాతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా దెబ్బకు వేల సంఖ్య మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాను గుర్తించేందుకు చైనా.. పోలీసులకు స్మార్ట్ హెల్మెట్లను అందజేసింది. శక్తిమంతమైన ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు, కెమెరా ఉన్న ఈ హెల్మెట్లు.. దూరం నుంచే మనుషుల శరీర ఉష్ణోగ్రతలను గుర్తించగలవు. 
 
ఆ హెల్మెట్లు పెట్టుకున్న పోలీసులు జస్ట్ అలా వీధుల్లో నిలబడి అందరినీ పరిశీలిస్తుంటారు. అదే సమయంలో హెల్మెట్ స్క్రీన్‌పై మనుషుల శరీర ఉష్ణోగ్రతలు ఆటోమేటిగ్గా కనిపిస్తుంటాయి. శక్తిమంతమైన ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్న హెల్మెట్లు ఎప్పటికప్పుడు వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను ఐదు మీటర్ల దూరం నుంచే గుర్తిస్తాయి. ఎవరికైనా నిర్ణీత ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటే.. వెంటనే అలారం మోగించి హెచ్చరిస్తాయి.
 
కాగా.. ఒక్క చైనాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఇన్ ఫ్రారెడ్ సెన్సర్లు ఉన్న పరికరాలను వాడుతున్నారు. విమానాశ్రయాల్లో తల దగ్గర చిన్న పరికరం ఉంచి టెస్టింగ్ చేయడం మనం వీడియోల్లో చూస్తూనే వున్నాం. అయితే అవి కేవలం కొద్ది సెంటీమీటర్ల దూరం నుంచే టెంపరేచర్‌ను గుర్తిస్తాయి. ప్రస్తుతం చైనా తయారు చేసిన హెల్మెట్లు ఐదారు మీటర్ల దూరం నుంచే స్కాన్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు