ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక శాంతి బహుమతిని మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. ఈ బహుమతిని ఈ యేడాది తనకే ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ఉండగా, మరో అగ్రదేశమైన రష్యా కీలక ప్రకటన చేసింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది.
ట్రంప్నకు మద్దతుగా ఈ ప్రకటనను రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి యూరి ఉషకోవ్ చేశారు. ఉక్రెయిన్తో జరుగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రెండోసారి అధికారం చేపట్టకముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకరోజులో ఆపేస్తానని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అది సాధ్యం కాకపోయినా.. ఆయన చేస్తోన్న ప్రయత్నాలను రష్యా పలుమార్లు అభినందించింది కూడా. కాల్పుల విరమణ సాధిస్తే అమెరికా అధ్యక్షుడిని నామినేట్ చేస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
నోబెల్ శాంతి బహుమతిపై విపరీతంగా ఆశలు పెట్టుకున్న ట్రంప్.. ఏకంగా ఆ బహుమతి ఇచ్చే కమిటీని కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబీయింగ్ని వేగవంతం చేసింది. ఈనేపథ్యంలో నార్వేకు చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ స్పందించారు. 'ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి. మీడియా లేదా బహిరంగ ప్రచారాలు మాపై చర్చలపై ప్రభావం చూపవు' అని చెప్పారు. ఏ అభ్యర్థి తరపున మీడియాలో ప్రచారం జరుగుతోందో కూడా గమనిస్తామన్నారు. నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యులు నామినేషన్లను పరిశీలిస్తారు. వీరు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
ట్రంప్నకు నోబెల్ ప్రైజ్ దక్కాలని బల్లగుద్ది వాదించే వారిలో పాకిస్థాన్ నేతలు ముందున్నారు. ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్.. తమ దేశం నుంచి నోబెల్ బహుమతికి నామినేషన్ పంపించారు. ఇటీవల శ్వేతసౌధం సందర్శన వేళ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నెతన్యాహు స్వయంగా ట్రంప్నకు బహూకరించారు. ట్రంప్ నోబెల్కు అర్హుడైతే..ఈ పోస్ట్ను రీట్వీట్ చేయండంటూ ఆయన కుమారుడు ఎరిక్ గురువారం ఎక్స్ వేదికగా తన ఫాలోవర్లను కోరారు. గాజాలో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్, హమాస్ తొలి దశ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. పీస్ ప్రెసిడెంట్ అని వైట్హౌస్ ఒక ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపట్లో శాంతి బహుమతి దక్కించుకునేది ఎవరో తేలిపోనుంది.