నా కష్టాల్లో.. సుఖాల్లో భాగమైన ఆ రైలును వదులుకోలేకపోతున్నా.. జో బైడెన్

మంగళవారం, 19 జనవరి 2021 (12:57 IST)
నా కష్టాల్లో సుఖాల్లో భాగమైన ఆ రైలు ప్రయాణాన్ని వదులుకోలేక పోతున్నా. దేశ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టేందుకు ఆ రైలులోనే వెళ్లాలని భావించా. కానీ, అది సాధ్యపడలేదు అంటూ జో బైడెన్ వ్యాఖ్యానించారు. 
 
అమెరికా దేశ 46వ అధ్యక్షుడుగా జై బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం తన సొంత పట్టణమైన డెలావర్ రాష్ట్రంలోని విల్ మింగ్టన్ నుంచి వాషింగ్టన్‌కు ప్రయాణించే రైల్లో వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
కానీ, ఆయన్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఇటీవల ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన దాడి నేపథ్యంలో, భద్రతా సిబ్బంది ఈ ప్రయాణానికి నిరాకరించింది. దీంతో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందే బైడెన్, తన కోరికను వదులుకోవాల్సి వస్తోంది.
 
కాగా, 1972లో డెలావర్ నుంచి సెనెటర్‌గా ఎంపికైన తర్వాత, నిత్యమూ ఈ రైల్లోనే బైడెన్ ప్రయాణించారు. అదేసమయంలో బైడెన్ భార్య, కుమార్తె ఓ ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు అబ్బాయిల బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, వారి ఆలనా, పాలన కోసం ఈ రైల్లో నిత్యమూ రాకపోకలు సాగించారు. 
 
ఇక అమెరికా ఉపాధ్యక్షుడుగా పనిచేసిన సమయంలోనూ ఆయన ఈ రైలు ప్రయాణాన్ని వదిలేయలేదు. అందుకే అయన సహచరులు 'ఆమ్ ట్రక్ జో' అని ఆయన్ను ఆటపట్టిస్తుంటారు కూడా. ఇక 2011లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న వేళ, స్వగ్రామమైన విల్ మింగ్టన్ స్టేషన్ పేరును జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ రైల్ రోడ్ స్టేషన్ అని పేరు కూడా పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో తన జీవితంలో భాగస్వామ్యమైన ఈ రైలులో బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లలేకపోయినందుకు బైడెన్ చాలా బాధపడ్డారు కూడా. 'నేను ఈ రైల్లో దాదాపు 8,200 ట్రిప్పులు తిరిగాను. మొత్తం 20 లక్షల మైళ్లు ప్రయాణించినట్టు. గడచిన 36 ఏళ్లలో ఎన్నో పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు రాత్రి వచ్చేసరికి ఇంటికెళ్లి పిల్లలకు కథలు చెప్పేందుకు ఈ రైలు సహకరించింది. నా ఎన్నో పనులను సాధ్యం చేస్తూ, విలువైన అనుభూతులను మిగిల్చింది. నా కష్టాల్లో, సుఖాల్లో భాగమైంది' అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు