అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకోనున్న వ్యోమగామి ఎవరు?

ఠాగూర్

ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (09:20 IST)
ఈ యేడాది ఆఖరులో అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. మరోమారు అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఆమె డిప్యూటీ కమలా హారిస్ బరిలో నిలిచారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో కమలాదే పైచేయిగా ఉంది. ఇదిలావుంటే, ఈ ఎన్నికల్లో తాను అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు ఇండో - అమెరికా సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వెల్లడించారు. 
 
అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్‌లు స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో చిక్కుకునిపోయిన విషయం తెల్సిందే. వీరిద్దరూ తాజాగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటామని విల్మోర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామని చెప్పారు. బాధ్యతగల అమెరికా పౌరులుగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం తమ కర్తవ్యమని చెప్పారు. తమ విధిని నిర్వహించుకోవడానికి నాసా సహకరిస్తుందని చెప్పారు. 
 
అలాగే, సునీతా విలియమ్స్ మాట్లాడుతూ, ఓటు వేయడం తమ బాధ్యత అని చెప్పారు. అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నామన్నారు. మరోవైపు, అంతరిక్షం నుంచి వ్యోమగాములు ఓటు వేయనుండటం ఇదే తొలిసారికానుంది. 1977 నుంచే వ్యోమగాములకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వీరు ఓటు వేసేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదే అయినప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా దాన్ని కొనసాగిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు