న్యూయార్క్ వైద్యుల అరుదైన ఆపరేషన్.. రెప్పతో సహా కంటిని సమూలంగా మార్చేశారు...

శుక్రవారం, 10 నవంబరు 2023 (12:03 IST)
న్యూయార్క్ వైద్యులు ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. రెప్పతో సహా కంటిని సమూలంగా మార్చివేశారు. ఇటీవల హైఓల్టేజీ తీగలు తాకడంతో ఓ వ్యక్తి కన్ను కోల్పోయాడు. దీంతో అతనికి కను రెప్పలతో పాటు కంటిని కూడా సమూలంగా మార్చివేశారు. అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను ఏకంగా 21 గంటల పాటు శ్రమించి పూర్తి చేశారు. అయితే, ఆ వ్యక్తికి చూపు వచ్చేది లేదని త్వరలో తెలుస్తుందని వైద్యులు తెలిపారు. 
 
అధిక వోల్టేజీ ఉన్న విద్యుత్తు తీగలు తగిలిన కారణంగా ఆరన్ జేమ్స్ అనే వ్యక్తి ముఖం చాలావరకు కాలిపోగా ఒక కన్ను మొత్తం పోయింది. కుడి కంటిని రెప్పతో సహా సమూలంగా మారిస్తే ఆయన ముఖానికి కొత్తరూపు ఇచ్చినట్లవుతుందని న్యూయార్క్ సిటీలోని లాంగోన్ హెల్త్ ఆసుపత్రి వైద్యులు భావించారు. 
 
ఆ ప్రకారం మే నెలలో 21 గంటల సేపు చేసిన శస్త్రచికిత్స విజయవంతమై కొత్తకన్ను ఆరోగ్యంగా ఉందని వారు గురువారం ప్రకటించారు. కన్నును మూసి, తెరవడం సాధ్యం కాకపోయినా కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని జేమ్స్ చెప్పారు. భవిష్యత్తులో ఇది ఎన్నో నూతన మార్గాలకు ద్వారం తెరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 
కాగా, అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఆధునిక వైద్య విజ్ఞాన కాలంలో న్యూయార్క్‌కు చెందిన వైద్యులు మాత్రం అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చివేసి రికార్డు సృష్టించారు. ఇలాంటి ప్రపంచంలోనే తొలిసారి అని చెబుతున్నారు. అయితే ఆ కన్నుద్వారా దృష్టి వస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు