యూనివర్శిటీ విద్యకు తాలిబన్ మహిళలు దూరం

బుధవారం, 21 డిశెంబరు 2022 (11:56 IST)
ఆప్ఘనిస్థాన్ దేశంలో తాలిబన్ల పాలన సాగుతోంది. ఈ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్ తీవ్రవాదులు అనేక రకాలైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే మాధ్యమిక, హైస్కూలు విద్యకు బాలికలను దూరం చేశారు. తాజాగా యూనివర్శిటీల్లో విద్యకు మహిళలను దూరం చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి తీసుకునిరావాలని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు హుకుం జారీ చేశారు. 
 
వాస్తవానికి తాబిలన్లు అధికారం చేపట్టిన తర్వాత తమ పాలన గతంలోలా ఉండదని, ఈసారి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, మైనార్టీలకు మరిన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, వాస్తవ రూపంలో అందుకు విరుద్ధంగా వారి పాలన సాగుతోంది. తమ ఏలుబడిలో అందుకు విరుద్ధంగా మహిళలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాలిబన్ నాయకత్వం తాజాగా వారిని యూనివర్శిటీ విద్యకు నిరవధింగా దూరం చేసింది. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. తాలిబన్ల తాజా ఆదేశాలను అన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. 
 
పార్కులు, జిమ్‌లకు వెళ్లకుండా మహిళలపై నిషేధం ఉంది. అలాగే, మాధ్యమిక, హైస్కుల్ విద్యకు బాలికలను దూరం చేశారు. చాలా వరకు ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మహిళలు బయటకు వచ్చే సమయంలో కాలి బొటన వేలి నుంచి తల వరకు మొత్తం వస్త్రంతో కప్పుకోవాలని ఆదేశించి, దాన్ని అమలుచేస్తున్నారు. దీన్ని ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలను విధిస్తున్నారు. 
 
తాజాగా యూనివర్శిటీ విద్య నుంచి మహిళలను దూరం చేశారు. అయితే, ఇది మంత్రివర్గ నిర్ణయమని, ప్రభుత్వం, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మహిళలు ప్రవేశాన్ని తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు