వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. అయితే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ యేడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా అకాడెమీ సభ్యులు మరియీ వైపు మొగ్గుచూపారు.
వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నానని, గత యేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది.
కాగా, మరియా వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా పని చేశారు. వెనెజువెలా సైనికీకరణకు తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది. ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. ఆయన నామినేషన్ను రష్యా, పాకిస్థాన్, కెనడా దేశాలు కూడా ప్రతిపాదించాయి. కానీ, ఆయన నిరాశే మిగిలింది.